.............సన్నపురెడ్డి వెంట్రామిరెడ్డి.

     ఇంటికి వెళ్లేసరికి రమాదేవి గోడుగోడుమంటోంది.
 ఎదురుగా సోఫాలో కూచుని వున్నాడు చిన్నకొడుకు హర్ష.
 అతని మీద ఎగిరి పడుతోంది.
 బైట రెండు జీపుల్నిండా ఆయుధాలు పట్టుకొని ఎక్కడికో దండయాత్రకు సిద్దమైన జనం.
 " ఇడుగో మీ నాయనొచ్చినాడు సూడు. యీయప్ప పనికి యీ యప్పే బోతాడు. మద్యన నువ్వెందెకు ?... మేముండగా నీ కెందుకురా యీ గొడవలన్నీ ? ... ఏమయ్యా ! ఈ జీపుల్లో మాసుల్ని తీసుకొని రంగుపల్లెకు పో.. ఆ శివపురి నాకొడుకులు అక్కడ ఏందో గొడవజేస్చాండారంట... మన పల్లెల కొచ్చి వాల్లు నీల్గుతావుంటే మనమెందుకయ్యా బతకడం ? ... నీ కొడుకు పోతానంటే నేనే నిలేసినా ! .... మనముండగా వాడెందుకు గొడవల్లో దిగాల ? ..."
 కొంతసేపు మౌనంగా వుండిపోయాడు చెన్నారెడ్డి. ..
  ’ ఆ శివపురి వాళ్లను ఎట్లా ఎదుర్కోవాలా ? ’ అని ఆలోచిస్తున్నాడు. తన ఏరియాకు కూడా వచ్చారంటే వాళ్లంత సులభంగా వుండరు.
 అతని మౌనాన్ని మరో విధంగా అర్థం చేసుకొంది ఆమె.  " ఏమయ్యా ! నువ్వు పోతావా ?  నన్ను పొమ్మంటావా ? నీకు సేతగాదంటే నేనే పోతా. నా కొడుకును మాత్రం పోనియ్యను..ఆ... తెల్సిందా ? "  అంది.
 మందిని తయారు చేసికొని శివపురి వాళ్లమ్మీద దాడికి సిద్దమై వున్నాడు హర్ష. తమ ఏరియాలో, తమ పల్లెల్లో వాళ్లు పెత్తనం చెలాయించబోవటం సహించలేక పోయాడు.
 మెల్లిగా ద్వారం వద్దకెళ్లి జీపులోని రంగాపురం మనిషిని పిల్చాడు చెన్నారెడ్డి.
 అతను రాగానే  " సంగతేందిరా ? "  అడిగాడు.
 " ఏముందయ్యా ! వాడు మల్లా వూర్లోకొచ్చినాడు "
 " ఎవుడు ? "
 " బుడ్డా రెడ్డోల్ల పెద్దోడు.. "
  " ఆ ... వస్తే..."
  " వాల్ల దాయాదుల కాల్లో కడుపో పట్టుకొని మెత్త బరుచుకొన్నేడు. వాని భూములు వానిగ్గావాలంట.. పంచాయితీ పెట్టినాడు. "
 " మీరేమన్నేరు ? "
 " ఏమంటాం ? .. నీకు తెలవకుండా పంచాయితీ యట్లా జేసుకుంటాం ? కొట్లాటలూ, గొడవలు లేకుండా వుంటే ఆ సంగతి వేరే ! అన్ని ఖర్చులూ పెట్టించినాడు గదా !  ఇప్పుడు భూము లెట్లా ఇడుస్చామూ ? "
 " వాల్ల దాయదులు ఏమంటా వుండారు ? "
  " వాల్లేందో వెనక తొక్కిళ్లు తొక్కుతావుండారు మరి !  వాని ఏడుపుల్జూసి కరిగిపోయినట్టుండారు. రొండుసార్లు వాల్లే పంచాయితీ జేసినారు. మేం వొప్పుకోకున్నెం.  ఇప్పుడు వాడు శివపురి వాల్లను పెద్ద మనుషులుగా తెచ్చినాడు. మేమాడుంటే గొడవలవుతాయని ఎల్లబారొచ్చినాం.. "
  ఒక్క నిమిషం ఆలోచించాడు చెన్నారెడ్డి.
 " సర్లే పోదాం పా !  ఆ నాకొడకల సంగతేందో సూసుకుందాం ... "  అంటూ బైటకు నడిచి జీపెక్కాడు.
  ఆయన వెంట నలుగురు గన్‌మెన్‌లు ఎక్కారు.
  రెండు జీపుల్నిండా ప్రవైటు సైన్యం, ఒక జీపులో తన సిబ్బందితో రంగపల్లె దిశగా పయనించాడు.
  దాదాపు ఏడేళ్లు దాటిపోతూవుంది - బుడ్డారెడ్డి కుటుంబాన్ని వూరినుంచి తరిమేసి.
వాళ్ల దాయాదులంతా కలిసి తనకు వ్యతిరేకంగా రాజకీయం చేశారు. బుడ్డారెడ్డి పెద్దకొడుకును ఏజంటుగా కూచోబెట్టారు.
 ఊరిపైన వాళ్లదే పైచేయి అయ్యింది.
 తను మాత్రం ఎమ్మెల్లేగా అఖండ మెజారిటీతో గెల్చాడు.
 అప్పుడు కూడా వాళ్లు తనతో కలవలేదు.
 సంవత్సరం తర్వాత వచ్చిన పంచాయితీ ఎలక్షన్లలో బుడ్డారెడ్డి వాళ్లే సర్పంచ్ స్థానానికి పోటే చేశారు.
 వాళ్లకు మద్దతివ్వమంటూ తన వర్గం వాళ్లను బలవంతపెట్టారు... అదిగో.. అప్పుడు తను రంగంలోకి దిగవలసి వచ్చింది.
 పంచాయితీ ఎలక్షన్స్‌లో బుడ్డారెడ్డి వర్గీయుల్ని తరిమి కొట్టి తన వాళ్లను గెలిపించుకొన్నాడు.
 తర్వాత కూడా వాళ్లమీద దాడులు కొనసాగాయి. అన్నిరకాలుగా వాళ్లమీద దాడులుచేసి క్రూరంగా హింసించటంతో -
  వాళ్లంతా తనకిందికొచ్చారు - ఒక్క బుడ్డారెడ్డి కుటుంబం తప్ప.
 వాళ్లల్లోనూ బుడ్డారెడ్డి పెద్దకొడుకే.
 అందుకే వాన్ని నిర్దాక్షణ్యంగా వూరినించి తరిమేశారు.
 వాని భూముల్ని లాక్కొన్నారు.
 అప్పుడు తనమాట వేద వాక్యంగా వుండేది.
 చివరకు ఇప్పుడు తన ప్రత్యర్థులు తన ఏరియాలో పంచాయితీలు చేసే పరిస్థితి వచ్చింది.  దాన్ని సహించేందుకు లేదు.
  వాళ్లతో అటో ఇటో తేల్చుకోవాలి.
 గొడవ జరిగితే గన్‌మెన్‌లను కూడా ఉపయేగించుకోవాలి. ఏడెనిమిది జీపుల తన సొంత మనుషుల కన్నా వీల్లే నయమని తేలింది మొన్న జి.పి.ఆర్ వద్ద దాడి జరిగినప్పుడే.  వీళ్లంతా కాళ్లకు, చేతులకు అడ్డం తప్పితే ఉపయోగం లేకుంది.
 మెరికల్లాంటి వారు నలుగురు చాలు.
 అతను ఆలోచనల్లో వుండగానే రంగంపల్లె దగ్గరబడింది.
 ఊర్లో ’వాళ్లు ’ న్నారనే విషయం కొంత టెన్షన్ కలిగిస్తోంది.
 ఊరి బైట జీపు ఆపి ఎదురైన మనిషిని అడిగారు శివపురి వాళ్ల ఆచూకి గురించి.
 అతన్నుంచి సరైనా సమాధానం లేదు.
 గ్రామంలోకి ప్రవేశించాయి జీపులు.
 ఓ యింటి వద్ద ఆగింతర్వాత జీపులోని రంగంపల్లె మనిషి దిగాడు.
 ఆదారాబాదరా కొంత దూరం వెళ్లి వీధి మలుపు వద్ద ఆగి, పక్కవీధిలోకి సుదీర్ఘంగా చూశాడు.
 ఆశ్చర్యబోతూ వెనుదిరిగి వచ్చాడు.
 " వాల్లు లేరు... ఎల్లబారినట్టుండాది - మేమెవురం పంచాయితీకి పోలేదు గదా ! అందుకేనేమో... "  చెప్పాడు.
 చెన్నారెడ్డి జీపు దిగాడు.
 తనకెప్పుడూ ఆతిథ్యమిచ్చే నారపురెడ్డి యింటిలోకి జొరబడ్డాడు.
 కొంత సేపయింతర్వాత బుడ్డారెడ్డి మనుషుల్ని పిలిపించుకొన్నాడు.
 కుశల ప్రశ్నలు వేశాడు.  గ్రామ బాగోగుల్ని పరామర్శించాడు.
 ఏయిడెడ్ పాఠశాలలో టీచర్ పోస్ట్ వేయించిన బుడ్డారెడ్డి తమ్ముని కొడుకును గురించి ఎంక్వయిరీ చేశాడు.
 తను కట్టించిన చెరువుకు మరమ్మతులు అవసరమైతే చెప్పమన్నాడు. ఏటి నుంచి తీసిన తాగునీటి పంపింగ్ స్కీమ్ గురించి అడిగాడు. బుడ్డారెడ్డి చేని వద్ద వంకకు అడ్డంగా కట్టిన చెక్‌డ్యాంలో నీరు దండిగా నిల్వవుండి పొలాలకు ఉపయోగ పడుతున్నాయో లేదో అడిగాడు.
  గ్రామానికి ఇంకా ఏవైనా అవసారలుంటే చెప్పమన్నాడు తన ఎమ్మెల్లే గ్రాంట్ లోంచి నిధులు విడుదల చేయిస్తానన్నాడు.
 ఆ వూరి అభివృద్ది కోసం తను చేసిన పనులన్నీ ఒకసారి గుర్తొచ్చేలా చేశాడు.  ఆ వూరు బాగుపడేందుకు తానింకా కృషి చేస్తున్నట్లుగా ప్రకటించాడు.
  బుడ్డారెడ్డి ఊ కొడుతున్నాడు. పొడి పొడిగా సమాధానం చెబుతున్నాడు.
 అతనిలో ఏదో తడబాటు.. మరేదో న్యూనతా భావం.
 ఏ విషయమో చెప్పాలనే భావం...  తీరా పెదవుల వద్దకొచ్చి ఆగిపోవటం...
  " సరే మరి  సమస్యలేమి లేవుగదా ! నేనొస్తా..  ఇంకా పల్లెలు తిరగాల "  అంటూ లేవబోయాడు.
 " అన్నా ! ఒక చిన్న సంగతుంది.. "  తల గీరుకొన్నాడు బుడ్డారెడ్డి.
 ’ఏమి ’ టన్నట్లుగా చూశాడు.
 " మా పెద్దోడొచ్చినాడు అన్నా !  వాని పొగురంతా అణుచుకొని వొచ్చిండు.  నేనేమో నీకాడికే పొమ్మని సెప్పినా..  ఆ నాకొడుక్కు మొగమెక్కలే.... సరే.. వూల్లో వాల్లను అడిగి సూస్జామనుకొన్నే... అందర్నీ అడిగినా... ఎవురేం అడ్డం జెప్పలేదు.. అడుగో అసలోడే వొప్పుకోలేదు.. ఏదన్న ఖర్చులుంటే కట్టిస్తాడు..  వాని పొలం వానికిప్పీ అన్నా !  నీకాడికి రాకపోవడం నా తప్పే..."  వేడికోలుగా చెప్పాడు.
  " ఎమ్మెల్లేగాడికి పంచాయితీకి వొచ్చేమాత్రమైతే శివపురి వాల్లను ఎందుకు తెచ్చుకొన్నట్లో ? "  వెంటనే అందుకొన్నాడు ఎదుటి మనిషి.
  " బుద్దిలేక.. " గట్టిగా అన్నాడు బుడ్డారెడ్డి.  " ఆ బుద్ది లేనా కొడుకు తీసుకొచ్చె... అందుకే మూతిమీంద కొట్టి ఎనక్కి పంపినా గదా ! "
  " నేను బద్వేలు పోతాండానని తెల్సి నువ్వా పన్జేసుంటావు.. "  అన్నాడు ఎక్కసగా.
   " ఒరేయ్ !  యీ తంటాల మాటలొద్దురా ! "  గట్టి గొంతుకతో అన్నాడు బుడ్డారెడ్డి.  ఎమ్మెల్లే వైపు తిరిగి  " అన్నా ! యీని కూతలు నువ్వు నమ్మగాకు.... పెద్దోన్నయినా నీ కాల్లుబట్టుకొని అడుగుతా వుండా.. నీ మనస్సుకు ఎట్టా దోస్తే అట్టా జెయ్యి.. "  అన్నాడు.
  కొంతసేపు ఆలోచించిన తర్వాత చెన్నారెడ్డి చెప్పాడు.  " సరేనీ పెద్దమాసీ !  మీరందరూ కావలన్నె పనిని నేనొద్దంటానా ?  అట్లనే కానీ !.... నీ కొడుకును నీ కాలికింద పెట్టుకొనే మాత్రమైతేనే యీ పంచాయితీ...  లేదంటే పెద్ద యిబ్బందులొస్తాయి.. శివపురి వాల్లు యీ వూరి పొలిమేర తొక్కగూడదు.  దానికి నీదే భాద్యత... రేపొక్కసారి నీ కొడుకును వెంటబెట్టుకొని బద్వేలుకు రా......"  అంటూ అవతలి వ్యక్తికేసి తిరిగి  " అబ్బీ ! నువ్వు కూడా రా ... "  చెప్పాడు.
  పదినిమిషాల తర్వాత జీపులు కదిలాయి.
  దారంతా ఆలోచిస్తూనే వున్నాడు చెన్నారెడ్డి.
  తన ప్రవర్తన తనకే ఆశ్చర్యాన్ని కలిగిస్తూ వుంది.
 ఇద్దరు ముగ్గుర్ని చంపి అయినా భయపెట్టుకోవాలని వచ్చాడు.
  బుడ్డారెడ్డి పెద్దకొడుకును కాలో చెయ్యో తీసెయ్యాలనుకొన్నాడు. తనను వ్యతిరేకించి శివపురి వాళ్లను పంచాయితీ తెచ్చినందుకు పెద్దశిక్షే వేయాలనుకొన్నాడు.
  కానీ...  యిట్లా జరిగిందేమిటీ.. ?
  తను సర్ధు బాటవుతున్నాడా ?  పరిస్థితుల్ని జయించి గుప్పెట్లో పెట్టుకొనే స్థితినుంచి పరిస్థితులకు అనుకుణంగా మార్పు  చెందే స్థితికి వస్తున్నాడు.
  తనకిది విజయమా ?  అపజయమా..?
  శివపురి వాళ్లకు భయపడే తనీవిధంగా మారాడా..?
  తను తీసుకొన్న యీ నిర్ణయం కాకుండా మరో నిర్ణయమయి వుంటే శివపురి వాల్లను ఆవూరికి వెళ్లకుండా చేసేందుకు పెద్ద యుద్దాలే చేయవలసి వచ్చేది.
  ఇప్పుడు అతిసులభంగా,  అందరి సమ్మతితోనే వాళ్లను గ్రామ ప్రవేశం లేకుండా చేశాడు గదా..!
 ఇది తనకు తప్పకుండా విజయమే.
  విజయాల్ని ఇలా కూడా పొందవచ్చునని తనకు తెలిసిపోయింది.
 చెన్నారెడ్డికి కొంత ఆనందంగా అన్పించింది.
 కొత్త సూత్రాన్ని అవిష్కరించిన శాస్త్రఙ్ఞునిలా అనుభూతించ సాగాడు.
 ఇట్లాంటి కేసులొస్తే తను.. ఇలాగే పరిష్కరించాలి.  తన వాళ్లను నెప్పించి మెప్పించయినా పంచాయితీల్ని యిలాగే చేయాలి.
  తన ఏరియాలో శివపురి వాళ్ల నీడ కూడా పడేందుకు లేదు.  వాళ్లు ప్రవేశించలేని పల్లెల్ని తను తయారు చేసుకోవాలి.
అట్లాగని  వాళ్లను ఉపేక్షించే దానికి లేదు.
  వాళ్లకు రాజకీయం ముఖ్యం కాదు -  తన చావే.  వాళ్లు ఏపని చేసినా అది తన్ను చంపేందుకు మార్గంగా ఎంచుకోవటానికే ప్రయత్నిస్తారు. తన జాగ్రత్తలో తనుండాలి.
  మర్నాడే రంగం పల్లె పంచాయితీ వొగదెగింది.
 బుడ్డారెడ్డి పెద్దకొడుకు కళ్లల్లోని ఆనందం,  దాని వెనకే పొర్లకొచ్చిన విధేయత చెన్నారెడ్డిని ఆకట్టుకొన్నాయి.
  మరో పదిరోజుల తర్వాత అట్లాంటిదే సురవరం పంచాయితీ.
 అక్కడయితే ఇల్లుకూడా ఆక్రమించుకొన్నారు.
  అది కూడా సులభంగానే పరిష్కారమైంది.
  శిథిలమవబోతున్న తన యింటిని బాగు పరుచుకోంటోన్నట్లుగా అన్పించింది చెన్నారెడ్డికి.
 కొత్త ఉత్సాహం వచ్చింది.
  తన ప్రాణాని కెటూ ముప్పు వాటిల్లింది.  తనతోబాటు రాజకీయాన్ని కూడా నాశనం చేస్తే ఎట్లా..?
  తను పోయినా రాజకీయం బతకాలి.
 తన సంతానం దాన్ని అందిపుచ్చుకోవాలి.
  తన హయామంతా భయపెట్టుకొని  ముఠా రాజకీయం చేశాడు.
  ఇప్పుడు తనే భయపడే పరిస్థితికి వచ్చాడు.
  కాలం ఎప్పుడూ ఒకేలా వుండదు గదా !
  తనున్నా లేకున్నా తన వాళ్లకు ఏకమొత్తంగా ఓట్లు గుద్దిపోసే అభిమానాన్ని రెండు మండలాల్లోనయినా సంపాదించుకోవాలి.  అవతలి పార్టీ వాల్లను తమ పొలిమేరల్లోకి కూడా అడుగుపెట్టని విధంగా పల్లెల్ని తీర్చి దిద్దికోవాలి.  మిగిలిన మండలాల్లో చెరిసగమో, లేదా తనకు కొంతశాతం తక్కువ ఓట్లు వచ్చినా ఇబ్బంది లేదు.  గెలుపు ఎప్పుడూ తమ వైపే వుంటుంది.
   సుదీర్ఘమైన మానసిక అంతర్జ్వలనం తర్వాత, ప్రక్షాళనం తర్వాత అతనో నిర్ణయానికి వచ్చాడు - తమ గుండా వూరు వదలి వెళ్లిపోయిన వాళ్లను తిరిగి వూర్లలోకి రప్పించే కార్యక్రమాన్ని మొదలెట్టాలని.
  చకచక ఆదిశగా అడుగులేశాడు.
  తన అనుయాయులకు సూచనలిచ్చాడు.
 కొద్ది సమయంలోనే ఆయన ఆలోచనకు మంచి స్పందన వచ్చింది.
  చాలామంది తమ తమ గ్రామాలకు వెళుతున్నారు.
  ఆస్థిని గురించి ఆలోచించే వాళ్లు సర్ధుబాటవుతున్నారు.
  అభిమానాలు,  ప్రాణాలు ముఖ్యమనుకొన్న వాళ్లు స్పందించటం లేదు.
  అయిన వాళ్లను పోగొట్టుకొని, అవమానాలు అనుభవించిన వాళ్లకు చెన్నారెడ్డి ప్రతిపాదన తమను మరింత అపహాస్యం చేసినట్లుగా అన్పించింది. అతనింకా మనుషుల్ని మనుషులుగా చూడలేదనీ, ఆస్తులుగానో, కులం మతం లాంటి మూఢ బావుకలుగానో చూస్తున్నాడని స్పందించారు.
 ఎనుబోతుల సుబ్బారెడ్డికి కూడా పిలుపు వచ్చింది.
  ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెళ్లిపోయాడు అతను.
  పెదనాన్న మాటల్లోని నిజం అప్పుడు తెలిసి వచ్చింది శివపురి రమణారెడ్డికి,  ఆయన ఆరోజే చెప్పాడు - ప్రాణాలు పోగొట్టుకొన్న వాళ్లకున్నంత పగ ప్రతీకారాలు ఆస్తిని పోగొట్టుకొన్న వాళ్లకు వుండవని.  అందువల్లనే జి.పి.ఆర్ బిల్డింగ్ వద్ద జరిగిన దాడిలో బాంబుల బక్కెట్లను దూరంగా తీసికెళ్లి ఎమ్మెల్లేను రక్షించాడు అతను.
  తన పాతభావాల్ని కొంత వరకు సంస్కరించుకొంటున్నప్పటికీ తను మాత్రం చాలా జాగ్రత్తగా తిరుగుతున్నాడు చెన్నారెడ్డి.
  అనుక్షణం అతన్ని చావు భయం వెంటాడుతోంది.
  ఆత్మీయుల వద్ద కన్నీళ్లు పెట్టుకోవటం మానలేదు.
   తనెట్లయినా చచ్చేనాకొడుకునేననీ, తనతో పెట్టుకోవద్దని కాంట్రాక్టర్లను బెదిరించి టెండర్ వర్క్‌లను ఇనానిమస్‌గా పొందేందుకు ప్రయత్నిస్తున్నాడు...  అదే మంత్రంతో ఇంజనీర్లను బెదిరిస్తున్నాడు. మీటింగ్‌లలోనూ, చర్చల్లోనూ తన చావు గురించి మాట్లాడుతున్నాడు.  తన మీద జనాల్లో సానుభూతి పెరిగేందుకు దారులు నిర్మించుకొంటున్నాడు.  తనంటే భయపడే దశనుంచి - తన మీద సానుభూతి చూపే దశకు పయనిస్తున్నాడు.
  అతను ఎక్కువగా రాజధానిలోనే గడుపుతున్నాడు.
  అతని విరోధులకు మాత్రం అతని మాటల్లోని చావు భయం సంతోషాన్ని కలిగిస్తూ వుంది. ఇంత కాలానికి అతని కళ్లల్లో భయపు నీడలు దోబూచులాడటం చూసి వింతగా అనుభూతిస్తున్నారు...  కథలు.. కథలుగా చెప్పుకొంటున్నారు.

                                                                                                                  .......సశేషం

0 comments:

About this blog

నాకే ఏమి తెలీయదు.

Followers



మాలిక: Telugu Blogs